'సంపత్ నంది' మూవీలో లీడ్ రోల్ లో 'అనసూయ'!
on Sep 17, 2021
డైరెక్టర్ సంపత్ నంది 'సీటీమార్' సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'సీటీమార్' ఈ నెల 10 న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. 'సీటీమార్' ఇచ్చిన జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు సంపత్ నంది. అయితే ఆయన తదుపరి సినిమాలో యాంకర్ అనసూయ లీడ్ రోల్ లో నటించనుందని టాక్ వినిపిస్తోంది.
బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు వెండితెర పైనా సత్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'పుష్ప'తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు అనసూయకి.. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో లీడ్ రోల్ లో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
'సీటీమార్' ఇచ్చిన సక్సెస్ జోష్ తో తన తదుపరి సినిమా పనుల్లో పడిపోయారు సంపత్ నంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందే ఈ సినిమాలో యాంకర్ అనసూయ ప్రధాన పాత్రను పోషిస్తోందని అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.