థియేటర్లలో విడుదల చేస్తే 50 లక్షలు ఖర్చు అని...
on Apr 25, 2020
లో బడ్జెట్ మీడియం సినిమాలకు ఓటీటీ వరంలా దొరికింది. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి సినిమాను ఇచ్చేస్తే మంచి రేటు వస్తోంది. అందుకని, 'అమృతరామమ్' సినిమాను జీ5కి అమ్మేశారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్, న్యూస్ నెట్వర్క్ గ్రూప్ జీకి చెందిన డిజిటల్ ప్లాట్ ఫామ్ 'జీ 5'లో ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది.
థియేటర్ లో ఓపెన్ చేయడానికి మరో ఆరు నెలలు పడుతుందనే వార్తలు ఓ వైపు... ఒకవేళ ఓపెన్ చేసిన ప్రేక్షకులు వస్తారా? రారా? అనే సందేహాలు మరోవైపు... వీటన్నిటి నడుమ డిజిటల్ రిలీజ్ మంచిదని 'అమృత రామమ్' దర్శకుడు సురేందర్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఆయన మాట్లాడుతూ "తక్కువ మంది ప్రేక్షకులు రావడం చిన్న సినిమాకు ఓ సమస్య అయితే... కరోనా తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రేక్షకులకు నా సినిమాని చూపించాలి అనుకుంటున్నాను. వెబ్ నాకు ఆ అవకాశం ఇస్తున్నప్పుడు... పైగా నేను ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఓటీటీ సరైన ఆప్షన్. ఒకవేళ నా సినిమా థియేటర్లో విడుదల చేయాలి అనుకుంటే ఇంకో 50 లక్షలు ఖర్చు పెట్టాలి. ఖర్చుపెట్టిన ప్రేక్షకులు వస్తారా రారా అన్నది ప్రశ్న! నేను తీసుకున్న నిర్ణయం సరైనది అనుకుంటున్నా" అని అన్నారు.