'అతిథి' హీరోయిన్ ప్రెగ్నెంట్!
on Oct 13, 2020
తెలుగులో మహేశ్ సరసన నటించిన 'అతిథి' సినిమా హీరోయిన్గా అమృతా రావ్ మనకు గుర్తుండిపోయింది. టాలీవుడ్లో ఆమె నటించిన ఏకైక సినిమా అదే. బాలీవుడ్లోనూ తనదైన ముద్రవేసి సూరజ్ ఆర్. బర్జాత్యా మూవీ 'వివాహ్' హీరోయిన్గా దేశవ్యాప్తంగా అభిమానులను ఆమె సంపాదించుకుంది. 2016 మే నెలలో రేడియో జాకీ అన్మోల్ను ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దానికి ఏడేళ్ల ముందు.. అంటే 2009లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తొలిసారి కలుసుకున్న ఆ ఇద్దరూ క్రమంగా ఒకరి గురించి ఒకరు ఆసక్తి పెంచుకుంటూ ప్రేమలో పడ్డారు. పెళ్లి టైమ్ వచ్చేదాకా వారు తమ ప్రేమను లోకానికి బహిర్గతం చెయ్యలేదు.
వారి పెళ్లి కూడా ప్రైవేట్ వ్యవహారంగా, తక్కువమంది సన్నిహితుల మధ్యే జరిగింది. పెళ్లయి, కాలచక్రంలో నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ జంట తమ జీవితాల్లో కొత్త దశలోకి ప్రవేశించేందుకు రెడీ అవుతున్నారు. ఆ దశ.. అమ్మానాన్నలు కావడం. అవును అతిథి హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆ విషయం ఖర్లోని ఓ క్లినిక్ దగ్గర ఆ జంట కనిపించినప్పుడు తెలిసింది. అమృత ఎత్తైన పొట్టతో కనిపించింది. వైట్ డ్రస్లో, మాతృత్వంలోకి అడుగుపెట్టేప్పుడు ఉండే తేజస్సుతో అందంగా ఉంది అమృత.
ఆమె తల్లి కానున్న సంగతి అతి కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. లాక్డౌన్ విధించే ముందే అమృత ప్రెగ్నెంట్ అయిన విషయం అమృతకు ఆ జంటకు తెలిసింది. వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పుకోడానికి ఇద్దరూ ఇష్టపడరు కాబట్టే ఇంతదాకా అది సీక్రెట్గానే ఉండింది.