ఆర్జీవీ గిమ్మిక్కులకు కాలం చెల్లింది!
on Dec 18, 2019
గిమ్మిక్కులతో ఆకర్షించి, తన సినిమాలకు కలెక్షన్లు తెచ్చుకోవాలని చూస్తున్న రాంగోపాల్ వర్మ ఆశలపై ప్రేక్షకులు మరోసారి నీళ్లు చల్లారు. ఆయన తాజా చిత్రం 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతిన్నది. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' పేరిట సినిమా తీసి నవంబర్ 29న రిలీజ్ చెయ్యాలనుకున్న ఆయనకు వరుసగా దెబ్బ మీద దెబ్బలు పడ్డాయి. ఆ సినిమా టైటిల్కు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా, ఒక కులాన్ని తక్కువచేసి, ఇంకో కులాన్ని ఎక్కువచేసే విధంగా టైటిల్ ఉందనే అభిప్రాయం వినవచ్చింది. పైగా ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టులో వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. మరోవైపు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆర్జీవీ సైతం కోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీకి వెళ్లడం, 16 కట్స్తో రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ జారీ చెయ్యడంతో ఎట్టకేలకు డిసెంబర్ 12న 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా పేరు మార్చుకొని ఈ సినిమా రిలీజయ్యింది.
చాలా కాలం నుంచి ఆర్జీవీ తన ట్వీట్ల ద్వారా, ప్రకటనల ద్వారా రచ్చ రచ్చచేసి సినిమాపై అంచనాలు పెంచడంతో ఆన్లైన్లో తొలిరోజు టికెట్లు అమ్మకాలు బాగానే ఉన్నట్లనిపించాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సంతోషపడ్డారు. అయితే సినిమాచూసిన వాళ్లంతా డిజప్పాయింటవడం, మౌత్ టాక్ నెగటివ్గా స్ప్రెడ్ అవడంతో రెండో రోజు నుంచే ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు ఈగలు తోలుకోవడం మొదలుపెట్టాయి. ఒక కథంటూ లేకుండా, ఒక పార్టీని టార్గెట్ చేసి, దాని డీగ్రేడ్ చెయ్యడానికీ, దాని అధినేత, అతని కొడుకును అపహాస్యం చెయ్యడానికీ ఈ సినిమా తీశారనే విషయం చాలా స్పష్టంగా కనిపించింది. తమకు తోచినట్లు ఏవో కొన్ని 'పప్పు' సన్నివేశాలు అల్లుకొని ఈ సినిమాకి ఆర్జీవీ స్క్రీన్ప్లే రాశారని, అందుకే సినిమా చివరలో తెరపైకి వచ్చి, తన పైత్యం ప్రదర్శించారనే అభిప్రాయం కలిగింది. ఇది బాగా ప్రచారంలోకి రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి కోల్పోయారు. మరోవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా డిసెంబర్ 13న వచ్చిన 'వెంకీమామ' ఆకర్షించడంతో 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' ఆడుతున్న థియేటర్ల వైపు కన్నెత్తి చూసేవాళ్ల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టదగ్గ స్థాయికి పడిపోయింది. ఇప్పుడైతే వేళ్ల మీద కూడా లెక్కించాల్సిన పనిలేదనీ, కళ్లతోటే ఎంతమంది వచ్చారనేది తెలిసిపోతోందనీ విశ్లేషకులు అంటున్నారు. 14వ తేదీ తర్వాత ఈ సినిమా గురించి ఆర్జీవీ ఇంతదాకా ఒక్క ట్వీటూ ట్వీటకపోడం ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఏమిటనేది చెప్పకనే చెబుతోంది.
14వ తేదీ కూడా 'జనసేన యూత్ - కోడూరుపాడు' తనపై వేసిన ఒక బ్యానర్ను పోస్ట్ చేసి, దండాలు పెట్టారు. ఆ బ్యానర్లో ఆర్జీవీ డిసెంబర్ 12న మరణించినట్లు ప్రకటించారు. పెద్దకర్మ డిసెంబర్ 26న జరుగుతుందని కూడా అందులో తెలిపారు. "నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని.. నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం" అని జనసేన యూత్ అందులో రాసుకొచ్చింది. దానికి మొదట "మీ లీడర్ని దెయ్యమై పట్టుకోవ్డానికి అతి త్వరలో వస్తున్నా" అని పోస్ట్ చేశాడు ఆర్జీవీ. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో, "పీకే, సీబీఎన్, లోకేశ్ అనుకూలురు, నాకు వ్యతిరేకులు, 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'పై బ్యాడ్గా మాట్లాడుతున్న వాళ్లు అర్థం చేసుకోవాలి.. ఈ సినిమాని నేను ఫన్ కోసమే తీశాను. వాస్తవంగా నాకు పీకే, సీబీఎన్, లోకేశ్ అంటే ఇష్టం. వాళ్ల ఫాలోయర్స్కు, ప్రత్యేకించి కోడూరుపాడు జనసేన ఫాలోయర్స్కు ఇది నా గాడ్ ప్రామిస్" అని ట్వీట్ చేశాడు. ఏదేమైనా 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లులేక దభేలుమంటూ కిందపడింది. విడుదలకు ముందు రాజకీయ వేడి రగిలించిన ఈ సినిమా, తీరా విడుదలయ్యాక ఎవరూ ఏమీ చెయ్యకుండానే ఆ వేడిని చప్పున చల్లార్చింది. ఈ సినిమాని తమ నాయకులని అపహాస్యం చేయడానికే తీశారంటూ గుండెలు బాదుకుంటూ వచ్చిన తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు, అభిమానులు సినిమా రిలీజయ్యాక హాయిగా ఊపిరి పీల్చుకున్నారు, సినిమా డిజాస్టర్ కావడంతో నవ్వుకుంటున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' చూసి పెదవి విరిచేశారు. 'తీసేదేదో బాగా తియ్యాలి కానీ, ఇంత నాసిరకంగా తీశారేమిటి?' అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వల్ల తెలుగుదేశం, జనసేన వాళ్లకు పోయిందేమీ లేదనీ, వైసీపీకి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏతావాతా ఈ సినిమాతో, దీనికి ముందుకు వచ్చిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో తేలిందేమంటే, గిమ్మిక్కులతో సినిమాలు ఆడవనీ, గిమ్మిక్కులు చేసి పబ్బం గడుపుకుందామనుకొనేవాళ్లకు ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా వాత పెడతారనీ!