ఐదేళ్ల తర్వాత తెలుగు తెరపై అమల!
on Nov 3, 2019
అక్కినేని ఫ్యామిలీ ఫిల్మ్ 'మనం' (2014)లో అమల అక్కినేని డాన్స్ టీచర్గా గెస్ట్ రోల్ చేశారు. దాని తర్వాత మళ్లీ ఆమె ఇప్పటి దాకా మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఆ తర్వాత ఆమె హిందీలో 'హమారీ అధూరీ కహానీ' (2015), 'కార్వాన్' (2018), మలయాళంలో 'కేరాఫ్ సైరాబాను' (2017) సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. అలాగే టెలివిజన్ తెరపైనా 'ఉయిమై' (తమిళం - 2014-15), 'హై ప్రీస్టెస్' (తెలుగు - 2019) సిరీస్లో నటించారు. ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్లకు పైగా విరామంతో తెలుగు తెరపై కనిపించనున్నారు. శర్వానంద్ హీరోగా ఇటీవలే 'ఖైదీ' చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ను సాధించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్.ఆర్. ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో శర్వానంద్ తల్లిగా అమల నటిస్తున్నారు. ఆమె తొలిసారిగా సెట్స్పై అడుగుపెట్టి సన్నివేశాల్లో పాల్గొన్న ఫొటోలను సినిమా యూనిట్ షేర్ చేసింది. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తండ్రి, నటుడు రవి రాఘవేంద్ర అమల భర్తగా నటిస్తున్నారు.
పాత్రల విషయంలో అమల అక్కినేని చాలా సెలెక్టివ్గా ఉంటూ అరుదుగా నటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కథ, తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఆమె ఒప్పుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో శర్వానంద్, అమల అక్కినేని, రవి రాఘవేంద్ర పాత్రల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 'పెళ్ళిచూపులు' ఫేమ్ రీతూవర్మ ఈ మూవీలో శర్వానంద్ జోడీగా నటిస్తున్నారు. నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్నేహం, ప్రేమ మధ్య విడదీయరాని బంధాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి 'మీకు మాత్రమే చెప్తా'తో హీరోగా కూడా మారిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాటలు అందిస్తుండటం విశేషం. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 సమ్మర్లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Also Read