నవంబర్ 15న 'యాక్షన్' చూపిస్తానంటున్న విశాల్!
on Nov 3, 2019
మాస్ హీరో విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'యాక్షన్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. 'ఇస్మార్ట్ శంకర్', 'గద్దలకొండ గణేష్', 'హుషారు', 'రాజుగారి గది 3' వంటి సూపర్హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా మారి శ్రీ కార్తికేయ సినిమాస్ పతాకంపై తొలిసారిగా 'యాక్షన్' చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ తెలుగు ట్రైలర్ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ "మా ఇస్టార్ట్ డిస్ట్రిబ్యూటర్, ఇస్మార్ట్ శ్రీను శ్రీ కార్తికేయ సినిమాస్ బేనర్పై 'యాక్షన్' సినిమాతో ఫస్ట్టైమ్ ప్రొడ్యూసర్ అవుతున్నాడు. సినిమా ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. విశాల్ హీరో, తమన్నా హీరోయిన్గా చేసిన సినిమా. సుందర్ సి. తన డైరెక్షన్తో చింపేశారు. ఫోటోగ్రఫీ గానీ, ఎడిటింగ్ గానీ, ప్రొడక్షన్ వేల్యూస్ గానీ, చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా శ్రీనుకి ప్రొడ్యూసర్గా పెద్ద సూపర్హిట్ రావాలి. బాగా డబ్బులు రావాలి" అన్నారు. నిర్మాత శ్రీనివాస్ ఆడెపు మాట్లాడుతూ "ఒక మంచి సినిమాతో నిర్మాతగా మారుతున్నాను. ఈ సినిమాలో మాస్ హీరో విశాల్ యాక్షన్ సీక్వెన్స్లన్నీ ఎంతో డెడికేటెడ్గా చేశారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్హాప్ తమిళ అందించిన సంగీతం సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. సుందర్ సి. ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అండర్ కవర్ మిషన్లో పనిచేసే మిలటరీ కమాండోగా విశాల్ కనిపిస్తారు. విశాల్ కెరీర్లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు" అన్నారు.
రాంకీ, కబీర్ దుహాన్ సింగ్, ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్షా పురి, యోగిబాబు, ఛాయా సింగ్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు, దర్శకత్వం: సుందర్ సి.