మెగా ఫ్యామిలీ నుంచి.. 500 కోట్ల సినిమా!
on May 11, 2017
బాహుబలితో టాలీవుడ్ లెక్కలన్నీ మారిపోయాయి. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనే సూత్రం పై నమ్మకం ఏర్పడింది. ఎంత ఖర్చు పెట్టినా తిరిగి వస్తుందన్న భరోసా కలిగింది. అందుకే టాలీవుడ్లో భారీ ప్రాజెక్టులకు బాహుబలితో అంకురార్పణ జరిగినట్టే. బాహుబలి స్ఫూర్తితో మరో మహత్తర ప్రాజెక్టుకు టాలీవుడ్ శ్రీకారం చుట్టింది. ఏకంగా రూ.500 కోట్లతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత ఎవరో కాదు... మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. రామాయణ గాథని వెండి తెరపై ఆవిష్కరించడానికి ఆయనో టీమ్ సిద్దం చేస్తున్నారు.
మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవ్వబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ఇలా దాదాపు అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని 3డీలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఈ చిత్రంలో నటించే నటీనటులు ఎవరు? తెర వెనుక పనిచేసే సాంకేతిక వర్గంలో ఎవరుంటారు?? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. మెగా ఫ్యామిలీలో కనీసం ఇద్దరు హీరోలకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశాలున్నాయని టాక్. మరి ఆ ఇద్దరు ఎవరు?? ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యత ఎవరికి అప్పగిస్తారు?? అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.