విజయదశమి విన్నర్.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'!
on Oct 18, 2021
దసరా పండగ విజేతగా అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ పోషించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీ నిలిచింది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల షేర్ సాధించి తొలి వారంలోనే ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టబోతోంది. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా మునుపటి మూడు సినిమాలతో నిరాశచెందిన అఖిల్.. ఎట్టకేలకు నాలుగో సినిమాతో హిట్ దక్కించుకొని, విజయానందం అనుభవిస్తున్నాడు.
దసరా సందర్భంగా మూడు సినిమాలు.. 'మహాసముద్రం', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' (ఎంఈబీ), 'పెళ్లిసందD'.. ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన 'ఎంఈబీ' క్లియర్ విన్నర్గా నిలిచిందని ట్రేడ్ విశ్లేషకులు తేల్చారు. ఫస్ట్ వీకెండ్ 'ఎంఈబీ' కలెక్షన్లు సూపర్బ్ అనిపించాయి. రెండు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాలు.. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ.. అఖిల్-పూజ జంటకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే యు.ఎస్. మార్కెట్లోనూ 'ఎంఈబీ' దూసుకుపోతోంది. అక్కడ ఆ మూవీ 4 లక్షల డాలర్ల మార్కును దాటింది. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో అఖిల్ అన్న నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరీ' ఉంది.
కాగా, విమర్శకులు పెదవి విరిచిన 'పెళ్లిసందD' మూవీ సైతం చెప్పుకోదగ్గ వసూళ్లను సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కూడా సంతృప్తికరమైన కలెక్షన్లను రాబట్టింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, కొత్తమ్మాయి శ్రీలీల హీరోయిన్గా నటించగా, రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా హిట్ దిశగా వెళ్తోంది.
అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజైన శర్వానంద్-సిద్ధార్థ్ మూవీ 'మహాసముద్రం' బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహకరమైన వసూళ్లను సాధిస్తోంది. బడ్జెట్పరంగా ఈ సినిమా డిజాస్టర్ అవడం ఖాయమంటున్నారు.