ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో భారీ చోరీ!
on Mar 20, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నైలోని తన నివాసంలో లాకర్ లో భద్రపరిచిన లక్షల్లో విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహానికి ఆ ఆభరణాలు ధరించానని చెప్పిన ఆమె.. ఆ తర్వాత వాటిని లాకర్ లోనే భద్రపరిచానని, అయితే ఇటీవల లాకర్ తెరిచి చూడగా ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐశ్వర్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంట్లో పనిచేసే సిబ్బంది పనే అయ్యుంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఐశ్వర్య తమిళ హీరో ధనుష్ కి మాజీ భార్య అనే విషయం తెలిసిందే. 2004 లో వివాహం చేసుకున్న వీరు.. 18 ఏళ్ళ తరువాత గతేడాది విడాకులు తీసుకొని షాక్ ఇచ్చారు. ధనుష్ హీరోగా నటించిన '3'(2012) సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో 'లాల్ సలాం' అనే చిత్రం రూపొందుతోంది.