శశి కిరణ్ బాటలో వేణు కూడా వెళతారా?
on Jun 12, 2022
తెలుగునాట పలువురు దర్శకులు `ద్వితీయ విఘ్నం` బారిన పడ్డవారే. అయితే, కొందరు మాత్రం తొలి చిత్రానికి మించి విజయం చూశారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, దర్శకధీరుడు రాజమౌళి, విజనరీ కెప్టెన్ కొరటాల శివ తదితర దర్శకులు ఈ జాబితాలో ఉంటారు. తాజాగా శశి కిరణ్ తిక్క కూడా ఈ లిస్ట్ లో చేరారు. `గూఢచారి` (2018) వంటి విజయవంతమైన సినిమా తరువాత శశి కిరణ్ తెరకెక్కించిన `మేజర్` ఘనవిజయం సాధించింది. ఈ జూన్ 3న జనం ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది.
ఇదిలా ఉంటే, శశి కిరణ్ దర్శకుడిగా పరిచయమైన 2018లోనే `నీదీ నాదీ ఒకే కథ`తో దర్శకుడైన వేణు ఊడుగుల తన మొదటి ప్రయత్నంలో చెప్పుకోదగ్గ ఫలితాన్ని చూశారు. విభిన్న కథాంశంతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నారు. కట్ చేస్తే.. ఈ జూన్ 17న `విరాట పర్వం`తో పలకరించబోతున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. రానా దగ్గుబాటి, సాయిపల్లవి, నందితా దాస్, ప్రియమణి వంటి మేటి తారాగణంతో ఈ నక్సల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరి తెరకెక్కింది. మరి.. శశి కిరణ్ బాటలోనే వేణు కూడా ఈ జూన్ నెల వేదికగా సెకండ్ ఎటెంప్ట్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాలి.