మహేశ్ చిత్రంలో ఐష్!
on Jun 12, 2022
కథానాయికగా ఐశ్వర్యా రాయ్ ది పాతికేళ్ళ ప్రస్థానం. అయితే, ఈ ప్రయాణంలో ఇప్పటివరకు ఒకే ఒక తెలుగు చిత్రంలో దర్శనమిచ్చింది ఐష్. అది కూడా.. ఓ ప్రత్యేక గీతంలో. కింగ్ నాగార్జునతో స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `రావోయి చందమామ` (1999)లో కాసేపు మెరుపు తీగలా స్టెప్పులేసింది ఐశ్వర్యా రాయ్.
కట్ చేస్తే.. 23 ఏళ్ళ తరువాత మరో తెలుగు చిత్రం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ స్టార్ బ్యూటీ. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి ఓ పాన్ - ఇండియా మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ ని శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కథను కీలక మలుపు తిప్పే ఓ స్పెషల్ రోల్ ఉందట. స్టైలిష్ గా ఉండే ఆ పాత్రలో ఐశ్వర్యా రాయ్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో ఐష్ నటించిన తాజా చిత్రం `పొన్నియన్ సెల్వన్ః 1` సెప్టెంబర్ 30న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించబోతున్న కొత్త చిత్రంలో ఐశ్వర్యా రాయ్ అతనికి జోడీగా సందడి చేయనుందని వినిపిస్తోంది.