డిస్కషన్ స్టేజిలో వరుణ్ - హరీశ్
on Dec 20, 2018
'దువ్వాడ జగన్నాథమ్ - డీజే' తరవాత మరో సినిమా ప్రారంభించడానికి దర్శకుడు హరీశ్ శంకర్ కిందా మీదా పడుతున్నారు. మొదట 'దాగుడు మూతలు' అని ఓ మల్టీస్టారర్ కోసం కథ సిద్ధం చేశాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'డీజే' నిర్మించిన దిల్రాజు 'దాగుడు మూతలు' కూడా నిర్మించాలని అనుకున్నారు. అయితే.. ఆయనకు కథ నచ్చకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు. తరవాత తమిళ్ హిట్ 'జిగర్ తండా' మీద హరీశ్ శంకర్ కన్ను పడింది. ఇందులో వరుణ్ తేజ్ విలన్గా చేయడానికి ఓకే చెప్పాడని వార్తలొచ్చాయి. వరుణ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. అయితే.. ప్రస్తుతానికి ఆ సినిమా డిస్కషన్ స్టేజిలో ఉందని తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. మరోవైపు... కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో గీతా ఆర్ట్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి అంగీకరించానని, అందులో బాక్సర్గా కనిపిస్తానని వరుణ్ తేజ్ స్పష్టం చేశాడు. అలాగే, 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నానని చెప్పాడు. తాను ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకోవడం లేదని, తాను చేయబోయే ప్రతి చిత్రంలో కొత్త పాయింట్ ఉండాలని అనుకుంటున్నానని, అలా సినిమాలు కుదురుతున్నాయని వరుణ్ తేజ్ అన్నాడు.