వంశీకి పొంగల్ మరోసారి ప్లస్సవుతుందా!
on Jun 21, 2022
అగ్ర కథానాయకులతోనే వరుసగా సినిమాలు చేస్తున్న దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. ప్రభాస్ తో `మున్నా`, జూనియర్ ఎన్టీఆర్ తో `బృందావనం`, రామ్ చరణ్ - అల్లు అర్జున్ కాంబోలో `ఎవడు`, నాగార్జునతో `ఊపిరి`, మహేశ్ బాబుతో `మహర్షి` చిత్రాలు చేసి ఆకట్టుకున్నారు వంశీ. కట్ చేస్తే.. ఇప్పుడు కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ తో ఓ బైలింగ్వల్ మూవీ తీస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. 2023 పొంగల్ స్పెషల్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పొంగల్ టైమ్ లో వంశీ పైడిపల్లి నుంచి రాబోతున్న రెండో చిత్రమిది. గతంలో చరణ్ - బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కించిన `ఎవడు` 2014 సంక్రాంతి స్పెషల్ గా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని `దిల్` రాజునే నిర్మించడం విశేషం. మరి.. సేమ్ బ్యానర్ కాంబినేషన్ తో సేమ్ సీజన్ లో రాబోతున్న వంశీ పైడిపల్లికి.. మరోసారి పెద్ద పండగ ప్లస్సవుతుందేమో చూడాలి. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు.