తెలుగులో 'కూలీ' దిమ్మతిరిగే బిజినెస్..!
on Jun 10, 2025
సినిమాకు ఉన్న హైప్ ని బట్టి, కాంబినేషన్ ను బట్టి.. కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగునాట భారీ బిజినెస్ చేస్తుంటాయి. రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన '2.O', యశ్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్-2' తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.70 కోట్లకు పైగా బిజినెస్ చేశాయి. ఈ రెండు కూడా సీక్వెల్ హైప్ తో వచ్చిన సినిమాలే కావడం విశేషం. అయితే సీక్వెల్ హైప్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ నటించిన కొన్ని సినిమాలు తెలుగునాట రూ.20-30 కోట్ల బిజినెస్ చేశాయి. ఆయన నెక్స్ట్ మూవీ 'కూలీ' అంతకుమించిన బిజినెస్ చేయనుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలే రజినీకాంత్-లోకేష్ కాంబినేషన్, దానికితోడు నాగార్జున కూడా ఉండటంతో.. తెలుగులో ఈ మూవీ బిజినెస్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. 'కూలీ' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా.. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, నాగవంశీకి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.40-45 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు.
మరి అన్నపూర్ణ, సితారలలో 'కూలీ' రైట్స్ ని ఏ బ్యానర్ దక్కించుకుంటుందో చూడాలి. రెండు బ్యానర్లు భాగస్వామ్యంతో తీసుకున్నా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ రెండు బ్యానర్ లు కలిసి అక్కినేని అఖిల్ హీరోగా 'లెనిన్' సినిమాని నిర్మిస్తున్నాయి. ఆ రిలేషన్ తో 'కూలీ' రైట్స్ ని కూడా సంయుక్తంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
