తేజకి కరోనా... ఇండస్ట్రీలో హైరానా!
on Aug 5, 2020
దర్శకుడు తేజకి కరోనా రావడంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హైరానా పడుతోంది. ముఖ్యంగా ఈ ఆందోళనకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయనకు కరోనా రావడం! రెండు... ఎంతో జాగ్రత్తగా ఉంటూ, ప్రతి ఒక్కరికీ జాగ్రత్తలు చెప్పే తేజకు వస్తే ఎవరికైనా రావొచ్చనే భయం!
ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు తేజకు కొవిడ్–19 కాంటాక్ట్ అయ్యిందని అనుమానిస్తున్నారు. మెయిన్స్ట్రీమ్ దర్శకులలో చాలా ధైర్యంగా షూటింగ్ స్టార్ట్ చేసిన వ్యక్తి తేజ. వెబ్ సిరీస్ తరవాత గోపీచంద్ హీరోగా చేయనున్న ‘అలిమేలు మంగ వెంకటరమణ’ షూటింగ్ చేయాలనుకున్నారు. యూనిట్ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిపారు. వందల పీపీఈ కిట్లు తెప్పించారట. ప్రస్తుతం తేజకి కరోనా రావడంతో ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పటికీ కాకపోవచ్చని సమాచారం.
వెబ్ సిరీస్ షూటింగ్లో తేజ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడూ అందరూ మాస్క్లతో ఉన్నారట. అయితే, తేజకు గాలి ద్వారా కంటి నుండి కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఇండస్ట్రీ హైరానాకి కారణం అవుతోంది. గాలి ద్వారా అయితే ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సోకవచ్చు. అవుట్ డోర్ షూటింగ్స్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. అందుకని, ఆగస్టు లేదా సెప్టెంబర్లో షూటింగ్స్ చేయాలనుకున్నవాళ్ళు ఇప్పుడు ఆలోచనలో పడ్డారట.