అభిమానులను నామినేట్ చేసిన సందీప్ కిషన్
on Aug 5, 2020
సాధారణంగా ఛాలెంజ్లు నడుస్తాయి కదా! అందులో సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేస్తారు. ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తరవాత తమకు సన్నిహితులైన మరో సెలబ్రిటీని నామినేట్ చేస్తారు. కానీ, సందీప్ కిషన్ డిఫరెంట్గా ఆలోచించాడు. సెలబ్రిటీలను కాకుండా తన ఫ్యాన్స్, ట్విట్టర్ ఫాలోయర్లను నామినేట్ చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే...
రాజసభ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రజలతో మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మంగళవారం హీరో సందీప్ కిషన్ పాల్గొన్నారు. నటి లక్ష్మీ మంచు, నటుడు జీవన్రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించిన ఆయన, హైదరాబాద్లోని తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘‘ప్రకృతి ప్రేమికుడిగా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భూమితల్లి పచ్చగా ఉంటే, భూమిపై ఉన్న బిడ్డలందరూ క్షేమంగా ఉంటారు. మనకు ప్రాణవాయువు ఇచ్చే పచ్చని చెట్లు పెంచడం ముఖ్యం. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్ కుమార్కి కృతజ్ఞతలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనవలసిందిగా అభిమానులు, ప్రేక్షకులకు పిలుపునిస్తున్నా. మొక్కలు నాటిన వాళ్లందరూ ఫొటోలతో ట్వీట్స్ చేస్తే... నేను రీట్వీట్ చేస్తా’’ అన్నారు. ఇప్పటికే పలువురు సినిమా తారలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.