ENGLISH | TELUGU  

డబ్బింగ్ సినిమాలకూ హైక్ లు.. తెలుగు ప్రేక్షకులంటే అంత అలుసా?

on Aug 12, 2025

 

థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, తామే ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నామనే విషయాన్ని మాత్రం చాలామంది నిర్మాతలు గ్రహించలేకపోతున్నారు.

 

ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి ఓటీటీ, రెండు అధిక టికెట్ ధరలు. హిట్-ఫ్లాప్, చిన్న-పెద్ద అనే తేడా లేకుండా.. మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఇది చాలదు అన్నట్టు.. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టికెట్ ధరలు పెంచేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన 'బాహుబలి' లాంటి సినిమాకి టికెట్ ధరలు పెంచారంటే ఒక అర్థముంది. కానీ, అదే పనిగా స్టార్ హీరోలు నటించిన అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోవడం ప్రేక్షకుల అసహనానికి కారణమవుతోంది.

 

ఇది చాలదు అన్నట్టు.. డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్స్ హైక్ ఇస్తున్నారు. 'కేజీఎఫ్-2' నుంచి ఈ తంతు మొదలైంది. అధిక ధరకు తెలుగు రైట్స్ దక్కించుకొని.. ఆ మొత్తం రాబట్టడానికి ప్రభుత్వాల నుంచి హైక్ కోసం పర్మిషన్ తీసుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు 'కూలీ', 'వార్-2' వంటి సినిమాలు పయనిస్తున్నాయి. వాటిలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ నటించడం.. ఎక్కువ మొత్తం చెల్లించి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకోవడం.. వంటి కారణాలతో టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు కోరారు. దీంతో తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి భారీ సినిమాలకు ఏపీలో హైక్ కి అప్లై చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, కొందరు నిర్మాతలు మీడియం రేంజ్ సినిమాలకు కూడా హైక్ కోరుతున్నారు. ఇక తెలంగాణలో అయితే ఇప్పటికే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. పెద్ద సినిమా అయితే చాలు హైక్ అడుగుతున్నారు. ఆఖరికి డబ్బింగ్ సినిమాలకు కూడా ఈ తంతు కొనసాగుతోంది. 'కూలీ', 'వార్-2' సినిమాలనే తీసుకుంటే.. తమిళ్, హిందీలో కంటే ఇక్కడే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. 

 

భాషాభేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారనే ఒకే ఒక్క కారణంతో.. ఇలా ధరలు పెంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కొనసాగితే.. ప్రేక్షకులు థియేటర్లకు మరింతగా దూరమయ్యే ప్రమాదముంది. మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్ ధర దాదాపు రూ.500 ఉంటే.. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది?. అంతంత పెట్టి సినిమాకి వెళ్ళే కంటే.. నాలుగు వారాలు వెయిట్ చేస్తే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. 

 

సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ.. సాధారణ టికెట్ ధరలతో కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించవచ్చు. ఇటీవల విడుదలైన 'మహావతార్ నరసింహ'నే తీసుకుంటే.. యానిమేషన్ ఫిల్మ్ అయినప్పటికీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుట్ ఫాల్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. అదే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే.. ఫుట్ ఫాల్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని చాలామంది నిర్మాతలు గ్రహించట్లేదు. భారీ సినిమాల సంగతి అటుంచితే.. కనీసం మీడియా రేంజ్ మూవీలు, డబ్బింగ్ సినిమాల విషయంలోనైనా టికెట్ ధరల పెంపుకి అనుమతి కొరకపోవడం మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలా కాకుండా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం.. తెలుగు ప్రేక్షకుల అసహనం మరింత పెరిగే అవకాశముంది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.