సంక్రాంతికి రజని 'పేట'... '2.ఓ' పుణ్యమే!
on Dec 29, 2018
సంక్రాంతికి రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పేట' విడుదల కావడం ఖాయమే. ఇందులో మరో సందేహం లేదు. తొలుత 'పేట' తెలుగు వెర్షన్ విడుదలపై పలు సందేహాలు వినిపించాయి. తమిళంలో సంక్రాంతికి విడుదలైనా... తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదల కావొచ్చని పుకార్లు షికార్లు చేశాయి. అటువంటి పుకార్లకు చెక్ పెడుతూ తెలుగు హక్కులు కొనుగోలు చేసిన అశోక్ వల్లభనేని విడుదల తేదీ ప్రకటించారు. రజనీకాంత్ సరసన త్రిష, సిమ్రన్ నటించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ 'కథానాయకుడు' (జనవరి 9 విడుదల), రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' (జనవరి 11), వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్2' (జనవరి 12) సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రజని 'పేట' పోటీ పడనుంది.
నిజానికి, సంక్రాంతి సీజన్ మీద రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, వరుణ్ తేజ్ ఎప్పుడో కర్చీఫ్ వేశారు. మధ్యలో వున్నట్టుండి వుండి రజనీకాంత్ వచ్చాడు. తెలుగులో 'కబాలి', 'కాలా' సినిమాలు ఆశించిన రీతిలో విజయాలు సాధించలేదు. తెలుగు హక్కులు కొనుక్కున్న నిర్మాతల చేతులు కాలాయి. అందుకని, తొలుత సంక్రాంతి తెలుగు సినిమాల మధ్య రజని సినిమా విడుదల అనగానే ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. అయితే... '2.ఓ' విజయం పుణ్యమా అంటూ రజని మళ్ళీ నిర్మాతల్లో ఆశలు కలిగించాడు. తెలుగులో '2.ఓ' మంచి వసూళ్లు సాధించింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగి వచ్చాయట. దీనికి తోడు 'పేట' ట్రైలర్ రజని మాస్ మేనరిజమ్స్ తో సాగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగులోనూ సంక్రాంతికి సినిమాను తెస్తున్నారు. ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఎంతమేరకు వసూళ్లు రాబడుతుందో??