సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఇకలేరు
on Feb 11, 2020
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు పేరు తెలియని సినిమా ప్రముఖులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అటు సినిమా ప్రముఖులకు... ప్రేక్షకులకు.... సాంకేతిక నిపుణులకు... ఇటు ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. జీవితాన్ని సినిమా జర్నలిజానికి అంకితం చేసిన అతికొద్ది మంది జర్నలిస్టుల్లో ఆయన ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పటి నుండి ఆయన జర్నలిస్టుగా పని చేస్తున్నారు. టాలీవుడ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత... కొన్ని నెలల క్రితం వరకూ జర్నలిస్టుగా ఆయన సేవలు అందించారు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం కల పసుపులేటి రామారావుగారు మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 ఏళ్లు. గుండెపోటుతో మృతి చెందినట్టు సమాచారం. బుధవారం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.
తెలుగు సినిమా తెరపై తరాలు మారినా... సినిమాపై తరగని ప్రేమతో జర్నలిస్టుగా సేవలు అందించిన వ్యక్తి పసుపులేటి రామారావు. అలానటి మేటినటి భానుమతి, మహానటి సావిత్రి, శ్రీశ్రీ, దర్శకరత్న దాసరి, మెగాస్టార్ చిరంజీవికి ఆయన సన్నిహితులు. అందులోనూ చిరంజీవి అంటే పసుపులేటి రామారావుకి ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతో కుమారుడికి కల్యాణ్ నాగ చిరంజీవి అని మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు. విశాలంద్ర, ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, ఉదయం, సంతోషం తదితర పత్రికలు, మ్యాగజైన్లలో ఆయన పని చేశారు. భావితరాలకు సినిమా చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో 11 పుస్తకాలు రాశారు. ఆత్మకథ రాసుకున్న తొలి సినిమా జర్నలిస్ట్ ఆయనే. ఆయన పుస్తకాల్లో ‘నేటి మేటి సినీ ఆణిముత్యాలు’, ‘వెండితెర విషాదరాగాలు’ తప్ప మిగతావన్నీ బయోగ్రఫీలే. సావిత్రి, శ్రీదేవి, దాసరి, చిరంజీవిపై ఆయన పుస్తకాలు రాశారు. ఆయన ఎంత సీనియర్ అయినప్పటికీ... యువ జర్నలిస్టులను ఆప్యాయంగా, ప్రేమగా పలకరించేవారు. అందరినీ ప్రోత్సహించేవారు. పుసుపులేటి రామారావు మరణంతో తెలుగు సినిమా జర్నలిజానికీ, సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఆయన అజాత శత్రువు.