మురుగదాస్పై కన్నెర్ర చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు
on Feb 11, 2020
'దర్బార్' దర్శకుడు ఏఆర్ మురుగదాస్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం రోజు రోజుకూ పెద్దది అవుతోంది. కొన్ని రోజుల క్రితం తనకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వవలసిందిగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 'దర్బార్' నష్టాలను భరించాల్సిందిగా తనను డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేస్తున్నారని, లేదంటే చంపేస్తామంటున్నారని మురుగదాస్ పేర్కొన్నారు. వాళ్ల నుండి రక్షణ కోరారు. పోలీసుల దగ్గరకు వెళ్లడంపై హీరో శింబు తండ్రి, తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు టి. రాజేంద్రర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "రియల్ లైఫ్ లో హెల్ప్ చేయడానికి ముందుకు రాలేనప్పుడు... సినిమాల్లో సోషల్ ఇష్యూలను డీల్ చేయడం ఎందుకు? అందులో అర్థమే లేదు" అని మురుగదాస్ మీద టి. రాజేందర్ మండిపడ్డారు. వివాదం గురించి ఆయన మాట్లాడుతూ "డిస్ట్రిబ్యూటర్లను కలవడానికి మురుగదాస్ నిరాకరించారు.
మమ్మల్ని కలిసి ఏదో ఒక వివరణ ఇవ్వకుండా పోలీస్ ప్రొటెక్షన్ కోరడం ఎంతవరకు సమంజసం? మేమేమీ మిడ్ నైట్ ఆయన డోర్ బెల్ కొట్టలేదు కదా! సినిమా నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ 'భారీ బడ్జెట్ తో సినిమా తీశాం. ఇప్పుడు మేము ఏం చేయలేం. దర్శకుడి ని కలవండి' అని చెప్పింది. మేం దర్శకుడి ని కలవడానికి ప్రయత్నించాం. ఆయన ఈ విధంగా చేశారు. మురుగదాస్ చట్ట పరంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే... మేము చట్టపరంగా ముందుకు వెళతాం. డిస్ట్రిబ్యూటర్లు తుపాకీ, కత్తి విజయాల్లో ముఖ్య భూమిక పోషించినడం వల్లే దర్శకుడిగా ఆయన పారితోషికం పెరిగింది" అని అన్నారు. మరోవైపు మురుగదాస్ కు అండగా దర్శకుల సంఘం ముందుకు వచ్చింది. సినిమా నష్టాలను భరించాల్సింది నిర్మాణ సంస్థ కాని దర్శకుడు కాదని దర్శకుల సంఘం చెబుతోంది.
Also Read