సెట్టింగుల ఖర్చే రూ.30 కోట్లు?
on Feb 18, 2020
'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. ఆ రెండు పనులూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు అని ఉద్దేశం. సినిమాలకు వస్తే... 'సెట్టింగులు వేసి చూడు, స్టార్ హీరోతో సినిమా తీసి చూడు' అని చెప్పడం ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే... స్టార్ హీరోలతో సినిమా తీయడం అంటే ఈ రోజుల్లో మినిమమ్ వంద కోట్ల రూపాయలు కావాల్సిందే. సినిమా సెట్టింగులకు బోలెడు ఖర్చు అవుతుంది. అదే స్టార్ హీరోతో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మూవీ అంటే అంతకు అంత ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సెట్టింగులకు బోలెడు ఖర్చు అయింది. అలాగే, పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న సినిమా సెట్టింగులకు కూడా కోట్లలో ఖర్చు అవుతోందట.
దేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వం... రాజుల కాలంనాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోహినూర్ కొట్టేయడానికి ప్రయత్నించే ఒక బందిపోటు కథతో క్రిష్ కథ రెడీ చేశారు. ఆ కథకు తగ్గట్టు సెట్టింగులు కూడా వేశారు. కేవలం ఆ సెట్టింగులు కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ టాక్. భారీ సెట్టింగులు వేసి సినిమాలు నిర్మించడం నిర్మాత ఏయం రత్నానికి అలవాటే. శంకర్ దర్శకత్వంలో భారీ సెట్స్ వేసి సినిమాలు తీశారు. ఇప్పుడు పవన్ తో తీస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సెట్స్ వేశారు. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు.