సుశాంత్ ప్రేయసికి ఈడీ సమన్లు?
on Aug 4, 2020
దివంగత కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రేయసి రియా చక్రవర్తికి అతి త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేస్తుందనీ, విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తుందని ముంబై ఖబర్. ఆమెతో పాటు మరికొందరికీ సమన్లు వెళ్లనున్నాయని సమాచారం. రియా చక్రవర్తి మీద సుశాంత్ తండ్రి కేకే సింగ్ పెట్టిన కేసులో తన కుమారుడి బ్యాంక్ ఖాతాల నుండి అతడితో సంబంధం లేని వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు కోట్ల రూపాయల నగదు బదిలీ అయ్యిందనీ, దాని వెనుక రియా చక్రవర్తి ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలు చేసిన కొన్ని రోజులకు సుశాంత్ మృతిపై ఈడీ కేసు ఫైల్ చేసింది.
సుశాంత్ ఆడిటర్, సీఏ సందీప్ సింగ్ను పిలిచి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్... అవసరం అయితే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పిందట. త్వరలో రియా చక్రవర్తి, ఇతరులను విచారించడానికి సిద్ధమవుతుందని సమాచారం. సుశాంత్ ఖాతా నుండి నేరుగా రియా చక్రవర్తి ఖాతాకు డబ్బులు ట్రాన్సఫర్ కాలేదు. కానీ, ఆమె సోదరుడి ఖాతాకు సుమారు లక్షన్నర ట్రాన్సఫర్ అయ్యాయి. సుశాంత్, రియా చక్రవర్తి సహా అతడు కూడా రెండు కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నారు.
Also Read