కృష్ణంరాజు సంస్మరణ సభ.. బాప్ రే భోజనంలో ఇన్ని రకాలా!
on Sep 29, 2022
రెబల్ స్టార్స్ కృష్ణంరాజు, ప్రభాస్ పేర్లు వింటే ముందుగా వారి మర్యాదలు, భోజనాలు గుర్తొకొస్తాయి. అతిథులను వారు చూసుకునే తీరు గురించి సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలాగే తోటి నటీనటులకు వారి ఇంటి నుంచి ప్రత్యేకంగా వంటకాలు తెప్పించి రుచి చూపిస్తారు. ఇలా తమ ప్రేమని మర్యాదలు, భోజనాలు రూపంలో చూపించే రెబల్ స్టార్ కుటుంబం.. బాధలోనూ లక్ష మంది అభిమానులకు ప్రత్యేకంగా వంటలు చేయించి పెట్టడం విశేషం.
సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నేడు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకంగా లక్షమంది అభిమానుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. మెనూ చూస్తే రెబల్ స్టార్ కుటుంబానిది ఎంత పెద్ద చెయ్యో తెలుస్తుంది. సంస్మరణ సభకి హాజరైన అతిథుల కోసం 6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల మటన్ బిర్యానీ, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు, 1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు ఇలా మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలతో పాటు ఎన్నో రకాల వెజ్ వంటకాలను వండించారట. అభిమానుల కోసం ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయడంపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ప్రభాస్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు మొగల్తూరు వెళ్లారు. 2010లో తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో మొగల్తూరు వెళ్లిన ప్రభాస్ మళ్ళీ దాదాపు 12 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళాడు. దీంతో అభిమానులు ఆయనకు భారీ స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు తండోపతండాలుగా వెళ్లారు.