మహానటితో కలిసి 'నాటు నాటు' స్టెప్పేసిన చరణ్!
on Jan 27, 2022
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్గా కనిపించనున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. ఈ సినిమా జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్లో పార్క్ హయత్ లో `గుడ్ లక్ సఖి` ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "మహానటి తర్వాత సైన్ చేసిన సినిమా ఇది. కథ బాగా నచ్చింది. హైదరాబాద్ బ్లూస్.. ఆఫ్ బీట్ ఫిల్మ్.. ఆ తర్వాత గుడ్ లక్ సఖితో దర్శకుడు నగేష్ గారు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా లుక్ నేచులర్గా వుంటుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరినీ ధన్యావాదాలు. రామ్ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రామ్ చరణ్ గారి ఆర్ఆర్ఆర్ వస్తోంది. అందులో `నాటునాటు సాంగ్..` నాకే కాదు మా స్నేహితులకు కూడా బాగా నచ్చింది. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను." అన్నారు.
రామ్చరణ్ మాట్లాడుతూ.. "నేను అతిథిగా రాలేదు. నాన్నగారి దూతగా వచ్చాను. ఆయన ఆశీస్సులు తెలియపర్చడానికి వచ్చాను. సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడాలేదు. ఇప్పుడు ఏ బోర్డర్ లేకుండా ఇండియన్ సినిమా అని రాజమౌళి వల్ల పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఆడ, మగ కలిసి పనిచేస్తున్నారు. అందరూ ఒక్కటే. మహానటిలో కీర్తి నటన నచ్చింది. నేషనల్ అవార్డు దక్కించకోవడం గ్రేట్. మహానటి కీర్తిసురేష్, దేవిశ్రీప్రసాద్ ఇలా ఎందరో దిగ్గజాలు పని చేసిన ఈ సినిమా చిన్న సినిమా ఎలా అవుతుంది. ఇది చాలా మీనింగ్ ఫుల్ సినిమా అని నాకు అనిపిస్తుంది. ఈనెల 28న రిలీజ్ అవుతున్న ఈ మూవీకి మంచి విజయం చేకూరుతుందని భావిస్తున్నా." అన్నారు.
అనంతరం కీర్తి కోసం నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ వేసి అలరించారు రామ్ చరణ్. మీతో నాటు నాటు స్టెప్ వేయాలని కీర్తి అడగటం, మహానటి కోసం ఏ మాత్రం ఆలోచించకుండా డ్యాన్స్ వేస్తాను అని చరణ్ చెప్పడం ఆకట్టుకుంది. చరణ్, కీర్తి డ్యాన్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. నిజానికి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావాల్సి ఉంది. ఆయనకు కరోనా సోకడంతో ఆయన స్థానంలో రామ్ చరణ్ హాజరయ్యారు. అలా అనుకోకుండా ఈవెంట్ కి వచ్చిన చరణ్.. కీర్తితో కలిసి నాటు నాటు స్టెప్ వేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు.