నచ్చేసి.. మెచ్చేసుకున్నాడట!
on Nov 1, 2017
చిరంజీవి, రాజశేఖర్.. ఈ రెండు పేర్లూ కలిపి వింటే.. ఎవరైనా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోవాల్సిందే. కొన్నాళ్ల క్రితం వీరిద్దరికీ చిన్న సైజు యుద్ధమే జరిగింది. ఇప్పుడైతే.. లేదు లేండి. పూర్తిగా చల్లారిపోయింది. సినిమాల కుళాయి పల్చపడ్డాక.. రాజశేఖర్ లో కొంత మార్పు వచ్చింది. ప్రస్తుతం ఆయన అందర్నీ కలుపుకుపోయే పనిలో ఉన్నాడు. తన రాబోతున్న సినిమా ‘గరుడ వేగ’ చిత్రం ట్రైలర్ ని బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయించాడు. అంతేకాదు.. మంచి కథ దొరికితే బాలయ్య సినిమాలో విలన్ గా చేయడానికి ‘సై’ అని కూడా అనేశాడు. అయితే.. విలన్ పాత్ర ‘ధృవ’లో అరవింద్ స్వామి పాత్రలా ఉండాలట. అలాంటి పాత్ర అయితే.. బావుంటుందని మీడియా ముందు రాజశేఖర్ అభిప్రాయపడ్డాడు. అలాగే.. ‘గరుడ వేగ’ సినిమా చూడాల్సిందిగా.. ఇటీవలే ఇంటికెళ్లిమరీ చిరంజీవిని ఆహ్వానించాడు రాజశేఖర్. ‘నీ సినిమా గురించి మా ఆఫీస్ లో కూడా చర్చ నడుస్తోంది. ట్రైలర్ చూశా. చాలా బావుంది. తప్పకుండా సినిమా కూడా చూస్తా’ అని మెగాస్టార్ మాట కూడా ఇచ్చేశాడట. ఈ విషయాన్ని రాజశేఖరే స్వయంగా మీడయాకు తెలియజేయడం విశేషం. మొదట్నుంచీ ఇలాగే కలుపుగోలుగా ఉండుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా.. అని చాలామంది అనుకుంటున్నారు.