నేనెక్కడికీ వెళ్లను, ఏదీ అమ్మను - ప్రీతి
on Jun 20, 2014
ఐపియల్ ఫ్రాంచైజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్లో తన వాటాను అమ్మేసి, అమెరికా వెళ్లిపోతుందంటూ మీడియాలో ప్రీతి గురించి కథనాలు మొదలయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రీతి ఘాటుగా స్పందించింది. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ యజమానులు ప్రీతి జింటా, నెస్ వాడియా మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి జింటా గురించి అనేక కథనాలు, పుకార్లు మీడియాలో ప్రసారమవుతున్నాయి.
ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియా తనను అవమానించాడని ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ విషయంలో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మాఫియా కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందనే వార్తలు వచ్చాయి. సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ ఈ కేసులో ముఖ్య సాక్ష్యం ఇవ్వబోతున్నాడని కూడా సమాచారం.
ఇలా గందరగోళంగా తయారైన ఈ వాతావరణం నుంచి, వ్యాపారం నుంచి ప్రీతి తప్పుకుంటుంది అని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఆ వార్తలను ప్రీతి కొట్టిపారేసింది. తాను ఎక్కడికి వెళ్లటం లేదని, ఐపిఎల్ ఫ్రాంచైజ్ ని అమ్మటం లేదని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పష్టం చేసింది. ప్రచారం చేయాలనుకుంటే దేశంలో ఇంకా చాలా విషయాలున్నాయని, వాటిపై దృష్టి పెట్టమని ప్రీతి మీడియాకు సూచించింది.