ప్రకాష్ రాజ్, మంచు విష్ణుని కలిపిన సినిమా.. పవన్ కళ్యాణ్ క్లాప్!
on Jun 23, 2022
'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఇటీవల 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ యంగ్ హీరో చేతిలో 'గామి', 'ఓరి దేవుడా', 'దాస్ కా ధమ్కీ' వంటి సినిమాలు ఉండగా.. రీసెంట్ గా యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్ లో ఒక సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ లాంచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది.
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ కి పరిచయం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా గురువారం ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్.. హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రారంభ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.. విశ్వక్ సేన్ సాక్షిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్, విష్ణుల మధ్య పెద్ద యుద్ధమే జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకున్నారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో విష్ణు అక్రమ మార్గంలో గెలిచారని కూడా ప్రకాష్ రాజ్ వర్గం ఆరోపించింది. మా ఎన్నికల టైములో ఆ రేంజ్ లో కొట్లాడిన వీరిద్దరూ.. ఇప్పుడు ఈ సినిమా పుణ్యమా అని కలిసి కబుర్లు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.