మైత్రీలో మహేష్... పరశురామ్!
on Jul 30, 2019
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. మరి, ఈ సినిమా తరువాత మహేష్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారు? అనే ప్రశ్న ఘట్టమనేని అభిమానుల మదిలో ఎప్పటి నుండో ఉంది. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ తదితరులు మహేష్ కు కథలు వినిపించారని వార్తలు వచ్చాయి. అయితే... ఎవరి కథకు సూపర్ స్టార్ ముందుగా ఓటు వేస్తారు అనేది ఇంకా తెలియలేదు. కానీ, ఒక్కటి మాత్రం నిజం... మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్నారు. మహేష్ హీరోగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రయాణం ప్రారంభం అయింది. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'జనతా గ్యారేజ్', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. మళ్లీ మహేష్ తో ఎప్పుడు సినిమా నిర్మిస్తారని 'డియర్ కామ్రేడ్' విడుదలైన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మైత్రి నిర్మాతలకు ఎదురైంది. "ప్రస్తుతం మహేష్ బాబు కథలు వింటున్నారు. దర్శకుడు పరశురామ్ కథ వినిపించారు. ఓకే అయితే... సరిలేరు నీకెవ్వరూ పూర్తయిన తర్వాత ఉంటుంది" అని నవీన్ ఎర్నేని తెలిపారు. అదీ సంగతి!