తెలుగు చిత్ర పరిశ్రమకు మోడీ షాక్..
on Nov 9, 2016
దేశంలో విపరీతంగా పోగవుతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసే చర్యల్లో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఇప్పుడు ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమకు శాపంగా మారింది. రూ.500, రూ1000 నోట్లు చెల్లకపోవడంతో ఇప్పుడు సామాన్యుడు తలపట్టుకుంటున్నాడు. పాల ప్యాకెట్ నుంచి పెట్రోల్ వరకు ఏది కొనాలన్నా రూ.100 లేదా అంతకంటే తక్కువ కరెన్సీని మాత్రమే అనుమతిస్తున్నారు వ్యాపారులు. అదే పరిస్థితి థియేటర్ల వద్దా నెలకొని ఉంది..టికెట్ల కోసం పెద్ద నోట్లను ఇస్తే వాటిని అంగీకరించకపోవడంతో ప్రేక్షకులు వెనుదిరుగుతున్నారు. వచ్చే నెల రోజుల కాలంలో చాలా తెలుగు సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేస్తే కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఏం చేయాలో పాలుపోక టాలీవుడ్ జనాలు తలలు పట్టుకుంటున్నారు.