మొన్న `రుద్రవీణ`.. నిన్న `ఠాగూర్`.. నేడు `ఆచార్య`
on Jun 22, 2021
మెగాస్టార్ చిరంజీవికి మహాకవి, గీతరచయిత `శ్రీశ్రీ` (శ్రీరంగం శ్రీనివాసరావు) రచించిన ప్రసిద్ధ పంక్తులతో మంచి అనుబంధమే ఉంది. ``నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి ఆహుతిచ్చాను` అనే శ్రీశ్రీ పంక్తులకు.. తను కథానాయకుడిగా నటించిన `రుద్రవీణ` (1988), `ఠాగూర్` (2003) చిత్రాల్లో కథానుసారం వచ్చే పాటల్లో చోటిచ్చి తన అభిరుచి, అభిమానాన్ని చాటుకున్నారు. అలా.. శ్రీశ్రీ పంక్తులు వినియోగించిన రెండు సందర్భాల్లోనూ ఆయా గీతాలకు వేర్వేరు విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కడం విశేషం. `రుద్రవీణ`లో `చెప్పాలనివుంది` (పాట చివరలో `నేను సైతం` పంక్తులు వస్తాయి) అంటూ సదరు గీతం కోసం `గానగంధర్వుడు` ఎస్పీ బాలసుబ్రమణ్యం `ఉత్తమ గాయకుడు`గా నాలుగో `నేషనల్ అవార్డు`ని అందుకోగా.. `ఠాగూర్`లో `నేను సైతం` అంటూ శ్రీశ్రీ పంక్తులతో ప్రారంభమై మరో కోణంలో సాగే విప్లవాత్మక గీతం కోసం పాట రచయిత సుద్దాల అశోక్ తేజ `నేషనల్ అవార్డు`ని సొంతం చేసుకున్నారు.
అలా.. తన కెరీర్ లో మెమరబుల్ మూవీస్ గా నిలిచిన రెండు చిత్రాల కోసం శ్రీశ్రీ వాక్యాలను ఉపయోగించుకున్న చిరు.. రాబోయే చిత్రం `ఆచార్య`లోనూ ఆ సెంటిమెంట్ ని కొనసాగిస్తున్నారట. కథానుసారం వచ్చే ఓ భావోద్వేగభరిత గీతంలో శ్రీశ్రీ వాక్యాలను పునరావృతం చేయనున్నారట. మరి.. `ఠాగూర్` స్వరకర్త మణిశర్మ అందిస్తున్న ఈ బాణి.. సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `రుద్రవీణ`, `ఠాగూర్` చిత్రాల్లో శ్రీశ్రీ వాక్యాలు బాలు నోట పలికాయి. ఈ సారి మాత్రం ఆ అవకాశాన్ని ఆ మధుర గాయకుడి అభిమానులు మిస్ అవుతున్నట్లే. త్వరలోనే `ఆచార్య`పై వినిపిస్తున్న ఈ నయా ప్రచారంపై క్లారిటీ రానున్నది.
కాగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న `ఆచార్య`.. త్వరలోనే తుది దశ చిత్రీకరణకు సిద్ధమవుతోంది.