చైతూకి ఈసారైనా ప్లస్ అయ్యేనా!
on Oct 23, 2021
యువ సామ్రాట్ నాగచైతన్య ఒకే దర్శకుడితో రెండు లేదా అంతకుమించి సినిమాలు చేసిన సందర్భాలు తక్కువే. తనకు తొలి విజయాన్నిచ్చిన గౌతమ్ మీనన్ తో.. `ఏమాయ చేసావె` (2010) తరువాత `సాహసం శ్వాసగా సాగిపో` (2016) చేశాడు చైతూ. అలాగే `ప్రేమమ్` (2016) వంటి మెమరబుల్ మూవీని అందించిన చందు మొండేటితో సెకండ్ జాయింట్ వెంచర్ గా `సవ్యసాచి` (2018) చేశాడు. అయితే, అటు గౌతమ్ తో - ఇటు చందు మొండేటితో చేసిన ద్వితీయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను అందివ్వలేకపోయాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు చైతూ చేస్తున్న రెండు తెలుగు సినిమాలు కూడా ఆయా దర్శకులతో రెండో ప్రయత్నాలే కావడం గమనార్హం. `మనం` (2014) వంటి క్లాసిక్ తరువాత విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో `థాంక్ యూ` చేస్తున్న నాగచైతన్య.. `రారండోయ్ వేడుక చూద్దాం` (2017) వంటి సక్సెస్ ఫుల్ మూవీ అనంతరం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `బంగార్రాజు` చేస్తున్నాడు. మరి.. గౌతమ్, చందుతో సెకండ్ ఎటెంప్ట్స్ అచ్చిరాని నేపథ్యంలో.. ప్రస్తుతం తను ఉన్న ఫామ్ తో, కథాబలంతో విక్రమ్, కళ్యాణ్ కాంబోలోనైనా చైతూ విజయాలు అందుకుంటాడేమో చూడాలి.