టబు పాత్రలో మనీషా కోయిరాలా?
on Jun 19, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, `బుట్టబొమ్మ` పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `అల వైకుంఠపురములో`.. తెలుగునాట ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా, ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. `దేశీ బాయ్స్` (2011), `డిష్యూమ్` (2016) చిత్రాల దర్శకుడు, డేవిడ్ ధావన్ తనయుడు రోహిత్ ధావన్ దర్శకత్వంలో ఏక్తా కపూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారని సమాచారం. అంతేకాదు.. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారని టాక్. `లూకా చుప్పి` (2019) వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తిక్, కృతి ఈ సినిమా కోసమే మరోసారి జోడీకట్టనుండడం విశేషం.
ఇదిలా ఉంటే.. మాతృకలో కథానాయకుడి తల్లిగా నటించిన టబు స్థానంలో మరో సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాలా కనిపించనుందని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి మొదట ఈ పాత్రలో టబునే నటింపజేయాలని అనుకుంది యూనిట్. అయితే, `భూల్ భులైయ్యా 2`లో కార్తిక్, టబు కలిసి నటిస్తుండడంతో.. ఫ్రెష్ నెస్ కోసం మనీషా వైపు మొగ్గు చూపిస్తున్నారట. త్వరలోనే `అల వైకుంఠపురములో` హిందీ రీమేక్ లో మనీషా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
Also Read