'ఢీ', 'దేనికైనా రెడీ'ని మించేలా 'జిన్నా'
on Sep 9, 2022

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించగా.. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
జిన్నా టీజర్ వేడుక హైదరాబాద్ లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. తాజాగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్ ని బట్టి చూస్తే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తున్నప్పటికీ.. టీజర్ చివరిలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

టీజర్ విడుదల సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. "అభిమానుల ప్రేమ, అభిమానం కోసమే మేం సినిమాలు చేసేది. అభిమానులు లేకపోతే మేం లేము. జిన్నా నా మనసుకి దగ్గరైన సినిమా. ఈ సినిమాలో నా కంటే ముందు సన్నీనే ఫైనల్ చేశారు. కానీ ఇక్కడ సన్నీని ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. కానీ కోన గారు, నాన్నగారు, తెలిసిన మీడియా మిత్రులు సన్నీకే ఓటు వేశారు. ఢీ ఇచ్చిన శ్రీను వైట్ల గారి తర్వాత నన్ను అంతలా మెప్పించాడు డైరెక్టర్ సూర్య. అనూప్ తో ఎప్పటినుంచో పని చేయాలి అనుకున్నాను. ఈ సినిమాతో కుదిరింది. దేశంలోని గొప్ప సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన చోటా గారితో పని చేయడం గర్వంగా ఉంది. హీరోయిన్ గా పాయల్ అనగానే.. ఒకవైపు సన్నీ, మరోవైపు పాయల్ ఇక నన్ను ఎవరు చూస్తారు అనుకున్నా." అన్నారు.
పాయల్ మాట్లాడుతూ.. "టీజర్ జస్ట్ శాంపిల్.. పిక్చర్ అదిరిపోతుంది. ఈ మూవీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం రావడానికి ప్రధాన కారణమైన మోహన్ బాబు గారికి బిగ్ థాంక్స్. లవ్ యూ సర్. కోన గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలనుకుంది.. ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. విష్ణు గురించి మాటల్లో చెప్పలేను. ఆయన హంబుల్ పర్సన్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో, సన్నీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది." అన్నారు.
సన్నీ లియోన్ మాట్లాడుతూ.. " మీ అందరి అభిమానం వల్లే మేం పనిచేయగలుగుతున్నాం. మా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఈ టీమ్ తో వర్క్ చేస్తుంటే ఫ్యామిలీతో ఉన్నట్టు అనిపించింది" అన్నారు.
డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ.. "జిన్నా సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎన్నో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి" అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ.. "నేను ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాను. దానికి మొదటి ఇటుక వేసింది 'ఢీ' సినిమా. స్టోరీ రైటర్ గా నాకు గుర్తింపునిచ్చింది ఆ సినిమానే. ఆ తర్వాత మా కాంబినేషన్ లో 'దేనికైనా రెడీ' చేశాం. ఈ రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ రెండింటిని మించిన బ్లాక్ బస్టర్ జిన్నా అవుతుంది. విష్ణు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయనకి పర్ ఫెక్ట్ మీటర్ లో ఈ సినిమా ఉంటుంది" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



