`లూసీఫర్` రీమేక్.. అదంతా వట్టిదే!
on May 14, 2021
తెలుగులో అనువాదమైనా సరే.. తనకెంతగానో నచ్చేసిన మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`ని రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో.. ఈ రీమేక్ ని డీల్ చేయగల సమర్థుడైన దర్శకుడి కోసం చేసిన అన్వేషణలో.. `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన్ రాజా వైపు మొగ్గు చూపారు చిరు. తెలుగులో `హనుమాన్ జంక్షన్` ఒక్కటే తీసినా.. తమిళంలో మాత్రం పలు ఘనవిజయాలు అందించిన వైనం రాజా సొంతం. మరీముఖ్యంగా.. రీమేక్స్ ని నేటివిటికి తగ్గట్టు మలిచి విజయాలు అందుకోవడంలో ఘనాపాటి ఈ మేటి దర్శకుడు. అందుకే.. చిరు ఏరికోరి రాజాని ఈ రీమేక్ ని ఎంచుకున్నారు.
అయితే, ప్రాజెక్ట్ పట్టాలెక్కడంలో ఆలస్యం జరగడంతో.. మోహన్ రాజా తప్పుకున్నారంటూ కొందరు.. లేదు తప్పించారంటూ మరికొందరు కథనాలు అల్లేశారు. యూనిట్ ని కదిలిస్తే మాత్రం.. అదంతా వట్టిదే అని తేల్చేశారు. దీంతో.. `లూసీఫర్` రీమేక్ కెప్టెన్ ఛేంజ్ అంటూ వస్తున్న వార్తలకు బ్రేక్ పడినట్లయ్యింది. కాకపోతే, జనవరిలోనే ప్రారంభం కావల్సిన ఈ రీమేక్.. జూలైకి వాయిదాపడిందంతే. ఈలోపు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సద్ధుమణిగితే.. `ఆచార్య` పెండింగ్ వర్క్ ని ఫినిష్ చేసి `లూసీఫర్` వైపు ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు మెగాస్టార్.
కాగా, `లూసీఫర్` రీమేక్ ని ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించనుండగా.. తమన్ బాణీలు అందించనున్నారు.