జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత.. ఏం తేల్చారంటే..?
on May 21, 2025
రెంటెడ్ విధానాన్ని తీసేసి, షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాతల నుంచి సానుకూల స్పందన రాకపోతే.. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ప్రకటించారు.
నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఎగ్జిబిటర్స్ సమస్యలపై చర్చలు జరిగాయి. ఇందులో పలువురు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. మెజారిటీ సభ్యులు.. సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు.
గతంలో క్యూబ్ సమస్యలపై థియేటర్లు మూసివేత, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపివేత.. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో, ఈ సారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే పైరసీ, ఐపీఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించాలని ఎగ్జిబిటర్లను కోరారు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. దీంతో జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా పడింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
