ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ ఓటీటీ డీల్.. ఎందుకిలా చేశారు..?
on Oct 14, 2025

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని, 2026 జూన్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయముంది. అలాంటిది ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. (Dragon)
'డ్రాగన్' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందట. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ అయినట్లు సమాచారం. ఈమధ్య మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. అలాంటిది, 'డ్రాగన్' ఎనిమిది వారాల ఓటీటీ డీల్ చేసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. హిందీ వెర్షన్ మల్టీప్లెక్స్ చైన్స్ లో రిలీజ్ కావాలంటే.. ఎనిమిది వారాల దాకా ఓటీటీలో విడుదల చేయకూడదనే కండిషన్ ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో అంటే.. హిందీలో పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకే నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని.. ఈ ఎనిమిది వారాల ఓటీటీ డీల్ చేసుకున్నట్లు వినికిడి. (NTR Neel)
ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల ఓటీటీ రైట్స్ ని వరుసగా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంటోంది. 'ఆర్ఆర్ఆర్' మూవీ గ్లోబల్ స్థాయిలో మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత 'దేవర' కూడా రికార్డు వ్యూస్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, చాలా వారాలు ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన 'వార్-2' కూడా భారీ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ సినిమాలకు వస్తున్న విశేష ఆదరణ నేపథ్యంలో.. 'డ్రాగన్' రైట్స్ ని కూడా భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



