'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీజర్.. 'నాంది'కి మించి!
on Jun 30, 2022
గతేడాది 'నాంది' సినిమాతో ఆకట్టుకున్న అల్లరి నరేష్ ఈ ఏడాది మరో విభిన్న చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
నేడు(జూన్ 30) అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీజర్ ను విడుదల చేశారు. నిమిషన్నర నిడివి గల ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఓటు వేయడం కూడా తెలియని గిరిజనులు నివసించే అటవీ ప్రాంతంలోని గ్రామానికి.. ఎన్నికల విధిపై వెళ్లిన అధికారులుగా నరేష్, వెన్నెల కిషోర్ కనిపిస్తున్నారు. అక్కడ గిరిజనుల అవస్థలు ఏంటి? వారికోసం నరేష్ సాగించిన పోరాటం ఏంటి? వంటి అంశాలతో టీజర్ ని ఆసక్తికరంగా మలిచారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా రామ్ రెడ్డి వ్యవహరిస్తుండగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు. ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read