బెల్లంకొండతో భద్రమ్?
on Nov 26, 2018
వీవీ వినాయక్ దర్శకత్వంలో 'అల్లుడు శీను' చిత్రంతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యాడు. తరవాత భీమనేని శ్రీనివాసరావు, బోయపాటి శ్రీను, శ్రీవాస్ వంటి సీనియర్ స్టార్ దర్శకులతో పని చేశాడు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన 'సాక్ష్యం' తరవాత సడన్గా రూటు మార్చాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళతో 'కవచం' చేస్తున్నాడు. సీనియర్ దర్శకుడు తేజతో మరో సినిమా చేస్తున్నప్పటికీ.. 'కవచం' చిత్రానికి ముందు 40, 50 కథలు విన్నానని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలిపాడు. కథ నచ్చితే ఎవరితోనైనా సినిమా చేయడానికి సిద్ధమని చెబుతున్నాడు. దాంతో చాలామంది అతడికి కథలు చెబుతున్నారు. కథలు చెప్పిన వాళ్లలో అల్లరి నరేష్ 'అహనా పెళ్ళంట', సునీల్ 'పూలరంగడు' సినిమాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి కూడా వున్నారు. వీరభద్రమ్ దర్శకత్వం వహించిన మొదటి రెండు సినిమాలు విజయాలు సాధించినప్పటికీ... తరవాత 'భాయ్', 'చుట్టాలబ్బాయి' సినిమాలతో డిజాస్టర్లు అందుకున్నారు. అయితే... ఆయన కథ నచ్చడంతో బెల్లంకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తారని, జనవరి నుంచి ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. వీరభద్రమ్ దర్శకత్వం వహించిన 'చుట్టాలబ్బాయి' చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించారు.