ఇలాంటి నిర్మాత మళ్లీ రాడు
on Oct 5, 2015
తీసింది పదే సినిమాలు!
అందులో ఒకటి స్వాతి ముత్యం..
మరోటి సాగర సంగమం
ఇంకోటి శంకరాభరణం
ఇంతేనా.. ఇంకా ఉన్నాయ్.. సిరి సిరి మువ్వ, స్వయంకృషి, సీతాకోక చిలుక, సితార, ఆపద్బాంధవుడు..
సినీ జీవితంలో ఇలాంటి ఒక్క సినిమా తీస్తే చాలు అనుకొంటే పదిలో ఎనిమిది గొప్ప సినిమాలు తీశారు. ఆ నిర్మాత ఏడిద నాగేశ్వరరావ్!
తెలుగు చిత్రసీమకు స్వర్ణయుగాన్ని చూపించిన సంస్థల్లో పూర్ణోదయ క్రియేషన్స్ ఒకటి. తెలుగు చిత్రసీమ కేవలం కమర్షియాలిటీ చుట్టూనే గిర గిర తిరుగుతున్నప్పుడు కథని నమ్మి, పాత్రల్ని నమ్మి, దర్శకుడ్ని నమ్మి సినిమాలు తీసి... కళాత్మక భావాలకు కిరీటం తొడిగిన అరుదైన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.
చిరంజీవి లాంటి స్టార్ హీరో దొరికితే ఏ నిర్మాతైనా ఏం చేస్తాడు?
గబగబ మాస్ మసాలా కథ వండి, వడ్డించేస్తాడు.
కానీ ఏడిద నాగేశ్వరరావు అలా చేయలేదు. చిరు ఇమేజ్ని పట్టించుకోకుండా, చిరు ఫ్యాన్స్ ఏమనుకొంటారో అని లెక్కలేసుకోకుండా స్వయం కృషి తీశారు. అప్పటి వరకూ చిరంజీవి పాత్ర అనగానే నేల విడచి సాము చేసే విధానం కూడా పక్కన పెట్టి చెప్పులు కుట్టుకొనే పాత్రలో ఆవిష్కరింపచేశారు. డీ గ్లామర్ గా చిరుని తెరపైకి తీసుకొచ్చారు. ఆ సాహసానికి ప్రేక్షకులు హర్షద్వానాలతో స్వాగతం పలికారు. ఫలితం.. స్వయంకృషి సూపర్ హిట్. చిరుకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది. ఆపద్భాంధవుడు సినిమాకీ ఇదే సీన్రిపీట్ అయ్యింది. ఆ సినిమాలన్నీ తీసింది కె.విశ్వనాథ్ కావొచ్చు. కానీ.. తీసేంత ధైర్యం ఇచ్చింది మాత్రం.. ఏడిద నాగేశ్వరరావే.
కమర్షియల్ విలువలకు ఏనాడూ విలువ ఇవ్వలేదు ఏడిద నాగేశ్వరరావు. ఓ హిట్టొస్తే వెంటనే దాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఆత్రం చూపించలేదాయన. అందుకే అంత సుదీర్ఘ ప్రస్థానంలో పది సినిమాలే తీయగలిగారు. నిర్మాత అంటే కేవలం డబ్బుల పెడితే చాలు అనుకోలేదు. తన సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తన అభిప్రాయాల్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పేవారు. కథ కోసం సన్నివేశాల కోసం విశ్వనాథ్తో చాలాసార్లు వాదోపవాదనలు పెట్టుకొన్నారు. సాగర సంగమం సినిమాని విషాదాంతంగా మార్చి, గొప్ప కావ్యంగా నిలబెట్టాలన్న ఆలోచన... ఏడిదదే. సీతాకోక చిలుకకు యాంటీ క్లైమాక్స్ రాసినప్పుడు.... దర్శకుడు భారతీరాజాతో విబేధించి.. తెలుగు కోసం కొత్త వెర్షన్ రాయించుకొన్నారాయన. అదే సినిమా విశ్రాంతి సన్నివేశాలు లెంగ్తీ అయ్యాయని, తనకు తానే ట్రిమ్ చేసి.. దర్శకుడి చేత కూడా సెభాష్ అనిపించుకొన్నారు. రచయిత జంథ్యాల నటుడిగా మారడం వెనుక ఈయన పాత్ర కూడా ఉంది.
విజయాల్లో వాటా తీసుకొనేంత శ్రమ పడ్డారు ఏడిద. పరాజయాలకు బాధ్యత కూడా తానే తీసుకొనేవారు. ఘరానా మొగుడు తరవాత ఆపద్భాంధవుడు లాంటి సినిమాని విడుదల చేయడం తమ తప్పే.. అని చెప్పేవారు ఏడిద. తనయుడితో ఓ సినిమా తీసి చేతులు కాల్చుకొన్నారు. ఇది నేను ఎదుర్కొన్న తొలి పరాజయం.. బాధ్యుడ్ని నేనే అంటూ ఒప్పుకొన్నారు. తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్ఠాయిలో మార్మోగించిన స్వాతిముత్యం, సాగర సంగమం, శంకరాభరణం లాంటి సినిమాలు ఈ సంస్థ నుంచి వచ్చినందుకు ఆయనెప్పుడూ గర్వపడుతుంటారు. తన సంస్థ ఎదుగుదల కేవలం దర్శకులు, అద్భుతమైన నటుల వల్లే సాధ్యమైందని చెప్తుంటారాయన.
అలాంటి నిర్మాత మనమధ్య లేరిప్పుడు. అయితే పరిశ్రమ గర్వంగా పదికాలాల పాటు చెప్పుకొనే గొప్ప సినిమాల్ని అందించారు. ఆ సినిమాల రూపంలో ఆయన పాటించిన విలువలు, ఆయన ఆదర్శాలు బతికే ఉంటాయి..