దాసరి జన్మదిన ఉత్సవాల విశేషాలు
on May 3, 2014
ప్రతీ సంవత్సరం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా పురస్కారాలు ప్రధానం చేస్తున్నారని దాసరి జన్మదిన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఆయన హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... "ప్రతీ యేటా మే 4న దాసరి నారాయణరావు జన్మదినం ఓ ఉత్సవంలా జరుగుతోంది. పేద విద్యార్థులకు, కళాకారులకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా లఘుచిత్రాల పోటీని నిర్వహించాం. చక్కటి స్పందన లభించింది. 175 చిత్రాలు పోటీకి వచ్చాయి. అందులో 40 సినిమాలను ఎంపిక చేశాం. వాటిలో ఐదింటిని ఎంపిక చేసి ఆ చిత్ర దర్శకనిర్మాతలకు బహుమతులు అందజేస్తాం. తొలి ఉత్తమ చిత్రానికి రూ.10వేలు, రెండవ ఉత్తమ చిత్రానికి రూ.7500, మూడు,నాలుగు, ఐదవ స్థానాలలో వచ్చిన ఉత్తమ చిత్రాలకు రూ.5వేల చొప్పున బహుమతులు ప్రధానం చేయనున్నాం" అని అన్నారు. లఘుచిత్రాలు తీసి సినీ దర్శకులైన తనికెళ్ళ భరణి, మేర్లపాక గాంధీ, విరించి వర్మ, పవన్ సాధినేని, ప్రదీప్ మాడుగుల, రామ్ భీమనలు దాసరి ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనట్టు తెలిపారు.