నిర్మాతలకు స్టూడియోల నుండి ఆఫర్లు
on May 8, 2020
కరోనా వేళలో కాలు బయట పెట్టడం ప్రమాదమే. కంటికి కనిపించని మహమ్మారి ఏవైపు నుండి వచ్చి సోకుతుందో తెలియదు. కరోనా సామూహిక వ్యాప్తిని అరికట్టడానికి భౌతిక దూరాన్ని పాటించాలని, ఎక్కువ మంది ప్రజలు కలిసి తిరగొద్దని చెబుతున్నారు. షూటింగులంటే ఎక్కువమంది కావాల్సిందే. ప్రతిరోజూ ఇంటి నుండి రాకపోకలు సాగించాల్సిందే. మనమెంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ... ఎవరు ఎక్కడ నుండి వస్తారో తెలియని పరిస్థితి. అందుకని, షూటింగులు చేయకూడదని ప్రభుత్వం చెప్పింది. సినిమా పరిశ్రమ స్వచ్ఛందంగా దూరంగా ఉంటుంది. ఒకవేళ షూటింగ్ చేసే బృందమంతా ముందుగా పరీక్షలు చేయించుకుని కరోనా నెగెటివ్ అని తేలిన తర్వాత... ఒక చోట బస చేస్తూ, షూటింగ్ చేస్తే ప్రమాదం ఉండదు కదా! ఈ విధంగా ఆలోచించి నిర్మాతలకు స్టూడియోలు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
యూనిట్ మొత్తం తమ స్టూడియోకి వచ్చి నాన్ స్టాప్ గా 30, 40 రోజులు బస చేసి సీరియళ్ళు, సినిమాలు షూటింగ్స్ చేసుకోవచ్చని ఓ పెద్ద స్టూడియో ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు తెలిపారు. ఆయనకు సైతం స్టూడియోలు ఉన్నాయి. తమ స్టూడియో నుండి ఎటువంటి ఆఫర్లు ఇస్తున్నది ఆయన వెల్లడించలేదు. ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇస్తే తర్వాత ఇవన్నీ అమలులోకి తేవడం వీలు అవుతుందో లేదో తెలుస్తుంది. కుటుంబానికి దూరంగా 30, 40 రోజులు ఉండడానికి నటీనటులు సైతం ఒప్పుకోవాలి కదా!