చైతు కోసం రంగంలోకి దిగుతున్న మెగాస్టార్!
on Sep 17, 2021
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ స్టొరీ'. 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల - సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో 'లవ్ స్టొరీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మూవీపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ హైప్ ను రెట్టింపు చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
'లవ్ స్టోరీ' సినిమా ఈనెల 24న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. దాంతో ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 19న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. ఇక ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నట్టు సమాచారం. చిరంజీవి-నాగార్జున మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. గతంలో నాగార్జున ఫ్యామిలీకు చెందిన పలు ఈవెంట్స్ కు హరజైన చిరంజీవి.. మరోసారి స్నేహితుడి కొడుకు సినిమా ఫంక్షన్ కి రాబోతున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ లో నాగార్జున కూడా సందడి చేయనున్నారని సమాచారం.
'లవ్ స్టోరీ' సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. 2 గంటల 45 నిమిషాల నిడివిగల ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. నాగ చైతన్య -సాయి పల్లవి- శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.