'ఆదిపురుష్' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఊహించని అతిథి!
on Jun 5, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి, పాటలకి విశేష స్పందన లభించింది. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని జూన్ 6న తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ కార్యక్రమానికి ఊహించని అతిథి వస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది మూవీ టీం.
'ఆదిపురుష్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో రేపు(జూన్ 6) సాయంత్రం జరగనుంది. ఈ వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులెవరైనా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యే అవకాశముందని భావించారంతా. అయితే 'ఆదిపురుష్', రామాయణం ఆధారంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం కావడంతో.. ఆధ్యాత్మిక గురువు అయిన చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చిత్ర బృందం ఆయనను సంప్రదించగా.. ఈ వేడుకకు రావడానికి ఆయన వెంటనే అంగీకరించినట్లు సమాచారం.
'ఆదిపురుష్' సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.