'ఆదిపురుష్' ఈవెంట్ కోసం ముంబై నుంచి బైక్ యాత్ర!
on Jun 5, 2023
తమ అభిమాన హీరోలను కలవడానికి కొందరు అభిమానులు వందల కిలోమీటర్లు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, బైక్ యాత్రలు చేసిన సంఘటనలు చూశాం. అయితే ఒక సంగీత దర్శకుడు తాను పని చేసిన సినిమా వేడుక కోసం 1200 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా?.. 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటి అరుదైన ఘటనకు వేదిక కానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి. సిరీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 2023, జూన్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు(జూన్ 6) సాయంత్రం తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే 'ఆదిపురుష్' సంగీత దర్శకుల్లో ఒకరైన అతుల్ ఈ వేడుకకు ముంబై నుంచి బైక్ మీద వస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
పౌరాణిక సినిమాలకు పనిచేసే సమయంలో ఒక్కొక్కరు ఒక్కోలా తమ భక్తిని చాటుకుంటారు. 'ఆదిపురుష్'కి అద్భుతమైన పాటలు అందించడంలో తనవంతు పాత్ర పోషించిన అతుల్ తన భక్తిని మరింత ప్రత్యేకంగా చాటుకుంటున్నారు. ముంబై నుంచి తిరుపతికి 1200 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. అయితే అందరిలా ఫ్లయిట్ లో కాకుండా, దూరమైనా బైక్ పై రావాలని అతుల్ నిర్ణయించుకున్నారు. ఈరోజు తిరుపతి చేరుకునేలా జూన్ 3న బైక్ పై తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. శ్రీవారి దర్శనం చేసుకొని, రేపు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొననున్నారు. కాగా ప్రస్తుతం అతుల్ బైక్ యాత్ర వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read