అక్కినేని తొక్కినేని అని బాలయ్య ఎందుకు అన్నారంటే!?
on Jan 25, 2023
ఎన్టీఆర్, ఏఎన్నార్లను తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లుగా చెప్పుకుంటూ ఉంటారు. సినిమాలలో కొనసాగినంత కాలం ఆ ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వారి పిల్లలు కూడా అన్నదమ్ముల్లాగా పెరిగారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎందుకనో ఏఎన్ఆర్కు ఎన్టీఆర్తో సరిపడలేదు. ఆ విషయాన్ని ఏఎన్ఆర్ బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఇంత గొడవ ఉన్నప్పటికీ బాలయ్య ఒక దశలో ఏఎన్ఆర్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. అక్కినేనిని బాబాయి అని బాలయ్య సంబోధించేవారు. నాగచైతన్య అరంగేట్రం సమయంలో బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కానీ మధ్యలో ఎక్కడో బాలయ్యకి, నాగార్జునకు కూడా చెడింది. తన 'శ్రీమన్నారాయణ' చిత్రం హైదరాబాద్ కూకట్పల్లిలోని థియేటర్లో బాగా ఆడుతున్న సమయంలో దాన్ని తొలగించి నాగార్జున నటించిన షిరిడి సాయి చిత్రాన్ని అందులో ప్రదర్శించడం ఇరువురి మద్య గొడవకు ఆజ్యం పోసింది.
తన సినిమాకి కలెక్షన్లు ఉన్నప్పటికీ నాగార్జున సినిమా కోసం తమ చిత్రాన్ని తీసేయడంపై బాలయ్య తన సినిమా నిర్మాత రమేష్ పుప్పాల, దర్శకుడు రవి చావలిపై ఫైర్ అయ్యారు. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దాంతో బాలయ్య, నాగార్జున మధ్య దూరం పెరిగింది. ఈ దూరం ఎంతగా వెళ్లిందంటే అక్కినేని అస్తమించినప్పుడు చివరి చూపు చూడడానికి కూడా బాలయ్య రాలేదు. కనీసం సంతాప సందేశం కూడా పెట్టలేదు. తన తండ్రికి సమకాలీకుడు, తాను ఒకప్పుడు బాబాయిగా పిలుచుకునే వ్యక్తి, ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన ఏఎన్ఆర్ చనిపోతే చివరి చూపు చూడడానికి కూడా బాలయ్య రాలేదంటే ఎంతగా గొడవ జరిగిందో ఏమో..! కాగా నాగార్జునతో బాలయ్య దూరం పెరుగుతూనే ఉంది.
నాగ్ సైతం బాలయ్య ఊసే ఎత్తడానికి ఇష్టపడడు. ఆయన్ని కలవడు. బాలయ్య రెండో కుమార్తె పెళ్లికి కూడా నాగ్ హాజరు కాలేదు. 'వీరసింహారెడ్డి' విజయోత్సవ వేడుకల్లో బాలయ్య మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అని యథాలాపంగా మాట అనడంతో మరోసారి అక్కినేని ఫ్యామిలీతో బాలయ్య విభేదాల గురించి చర్చ మొదలైంది. ఇంతకు వీరి మధ్య గొడవ ఏంటి? ఎందుకు వచ్చింది? ఏ విషయంలో ఈ విబేదాలు వచ్చాయి? ఇవి ఇక్కడి వరకు ఎలా తీసుకొచ్చాయి?.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇచ్చేవారు లేకపోవడంతో ఇవి బేతాళుడి ప్రశ్నలుగా, సమాధానం లేనివిగానే మిగిలిపోతాయి.