సాయిపల్లవిపై హైదరాబాద్లో పోలీస్ కేస్
on Jun 17, 2022
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లతో సాయిపల్లవి వార్తల్లో వ్యక్తిగా మారింది. హిందువుల మనోభావాలను ఆమె గాయపరిచిందంటూ హైదరాబాద్ ఆమెపై ఓ కేసు నమోదైంది. కశ్మీరీ పండిట్లపై జరిగిన మారణకాండను, గోవులను ఎత్తుకెళ్తున్న వారిపై దాడి చేయడాన్ని ఒకే గాటన ఆమె కట్టిందని ఆరోపిస్తూ రెండు రోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో పలువురు దుమ్మెత్తిపోస్తూ వస్తున్నారు.
తన లేటెస్ట్ ఫిల్మ్ 'విరాటపర్వం' ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "హింస అంటే రాంగ్ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని నా ఫీలింగ్. వయొలెంట్గా ఉంటే ఇది సాధించగలుగుతాం అని ఇప్పుడు నేను ఆలోచించను. నక్సలెట్ల కాలంలోని హింసను అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టం. వాళ్లు చేసింది కరక్టా, కాదా అనేది చెప్పడం కష్టం. ఇది చేస్తేనే తమకు కావాల్సింది దక్కుతుందని నమ్మి వారు హింసను అనుసరించారు. నేను పెరిగింది చాలా తటస్థ వాతావరణంలో. లెఫ్టిస్ట్ ఫ్యామిలీలో కానీ, రైటిస్ట్ ఫ్యామిలీలో కానీ నేను పుట్టినట్లయితే నేను ఎవరికో ఒకరివైపుకి ఫేవర్ చేసుంటానేమో. నేను చాలా న్యూట్రల్ ఫ్యామిలీలో పెరిగాను. నువ్వు మంచి మనిషిగా ఉండు అని చెప్పే ఫ్యామిలీలో పెరిగాను." అని తెలిపింది సాయిపల్లవి.
"ఎవరైతే హింసకు గురవుతుంటారో వాళ్లను ఆదుకోమని చెప్తుంటారు మావాళ్లు. నేను లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ గురించి విన్నాను. ఎవరు తప్పు, ఎవరె కరెక్ట్ అని మనం ఎప్పుడు చెప్పగలం? ఇటీవల 'కశ్మీర్ ఫైల్స్' సినిమా వచ్చింది. అప్పట్లో కశ్మీరీ పండిట్లను ఎట్లా చంపారో అందులో చూపించారు. ఒక రెలిజియస్ కాన్ప్లిక్ట్ లాగా తీసుకుంటే, కొవిడ్ టైమ్లో ఎవరో బండిలో ఆవును తీసుకెళ్తున్నారని ఆ బండి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ముస్లిం అని అతడ్ని కొట్టి జై శ్రీరామ్ అనమని చెప్పారు. అప్పుడు జరిగిన దానికీ, ఇప్పుడు జరిగిన దానికీ డిఫరెన్స్ ఏముంది? మనం మనిషిగా, మంచి వ్యక్తిగా ఉండుంటే మనం ఎవర్నీ బాధపెట్టం, ఒక మనిషిపై ఒత్తిడి చేయం. మీరు మంచి మనిషి కాకపోతే లెఫ్ట్ అయినా, రైట్ అయినా న్యాయం ఉండదు. మంచి మనిషిగా ఉంటే మీరెక్కడ ఉన్నా తటస్థంగా ఉండిపోతారు" అని ఆమె చెప్పుకొచ్చింది.
ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో అఖిల్ అనే భజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. చిత్రమేమంటే ఆ ఫిర్యాదులో విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ ఉత్తరాన్ని భజరంగ్ దళ్ భాగ్యనగర్ శాఖ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, దేశం మొత్తానికీ ప్రత్యేకించి కశ్మీరీ హిందువులకు సాయిపల్లవి క్షమాపణలు చెప్పకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.