నిర్మాత హిట్ అంటే... అల్లు శిరీష్ ప్లాప్ అన్నాడు!
on May 30, 2019
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చాలామంది అతడికి శుభాకాంక్షలు చెప్పారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపిన అల్లు శిరీష్, కొన్ని రోజుల క్రితం విడుదలైన 'ఎబిసిడి' ఫలితం గురించి స్పందించాడు. పుట్టినరోజున ఆ సినిమా ప్లాప్ అని తేల్చేశాడు. "మా దర్శకుడు సంజీవ్ రెడ్డి, 'ఎబిసిడి' యూనిట్ లో సభ్యులు అందరూ ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మా ప్రయత్నాలను పక్కన పెడితే... సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. నేను వినమ్రంగా ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును, సలహాలను అంగీకరిస్తున్నాను. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన నిర్మాతలు మధుర శ్రీధర్, యష్ రంగినేనికి థాంక్స్. సినిమా చూసిన ప్రేక్షకులకు, నా స్నేహితులకు, నాకు అండగా నిలిచిన మీడియా మిత్రులకు థాంక్యూ. భవిష్యత్తులో మంచి సినిమాలు అందించడానికి నేను హార్డ్ వర్క్ చేస్తానని చెప్తున్నా" అని అల్లు శిరీష్ ఒక ట్వీట్ చేశారు. సినిమా విడుదలైన నాలుగు రోజులకు నిర్మాత మధుర శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. "ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. సినిమాలో వినోదం వారికి నచ్చింది. మేం మండే టెస్ట్ పాస్ అయ్యాం. వసూళ్లు బాగున్నాయి" అని మధుర శ్రీధర్ అన్నారు. నిర్మాత సినిమా హిట్ అని చెప్పడానికి ప్రయత్నిస్తే... అల్లు శిరీష్ ప్లాప్ అని అంటున్నాడు.