నందమూరి హీరోలకు కలిసొచ్చిన పాప సెంటిమెంట్
on Aug 6, 2022
మహమ్మారి దెబ్బకు సినీ పరిశ్రమ కుదేలైంది. ఎందరో హీరోలు విజయాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతున్నారు. కానీ నందమూరి హీరోలకు మాత్రం మహమ్మారి తర్వాత బాగా కలిసొస్తోంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత అసలు ప్రేక్షకుల థియేటర్స్ కి వస్తారా అని భయపడుతున్న టైంలో బాలకృష్ణ 'అఖండ' సినిమాతో అఖండ విజయాన్ని అందుకొని సినీ పరిశ్రమలో ధైర్యాన్ని నింపాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఈ మూడు సినిమాకి ఒక కామన్ పాయింట్ ఉంది. అదే పాప సెంటిమెంట్.
'అఖండ' సినిమాలో అఘోరాకు, అతని తమ్ముడు(మురళి కృష్ణ) కూతురుకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పాపని అఘోరా కంటికి రెప్పలా చూసుకోవడం, పాప కోసం మృత్యుంజయ పూజ చేయడం మెప్పిస్తాయి. పవర్ ఫుల్ యాక్షన్ సినిమాలోనూ ఆ పాప ఎపిసోడ్ హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి అంతలా కనెక్ట్ అవ్వడానికి ఓ రకంగా ఆ పాప ఎపిసోడ్ కూడా కారణమని చెప్పొచ్చు.
ఇక 'ఆర్ఆర్ఆర్' మూవీ అయితే మల్లి అనే పాప పాత్రతో మొదలై, ఆ పాత్రతోనే ముగుస్తుంది. తల్లికి దూరమై బ్రిటిష్ కోటలో బందీగా ఉన్న మల్లిని ఆమె తల్లి దగ్గరకు చేర్చే కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. ఇందులో తారక్ యాక్టింగ్ ఆకట్టుకుంది. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో ఆయన నటనకు ప్రశంసల వర్షం కురిసింది.
'అఖండ', 'ఆర్ఆర్ఆర్' సినిమాల తరహాలోనే 'బింబిసార'లో కూడా పాప సెంటిమెంట్ ఉంది. క్రూరమైన రాజైన బింబిసారుడు మంచిగా మారడానికి పాప పాత్రే కారణం. 'అఖండ' చిత్రంలో లాగే 'బింబిసార'లో కూడా బింబిసారుడుకి, పాపకి మధ్య వచ్చే సన్నివేశాలు హత్తుకునేలా ఉంటాయి.
మొత్తానికి మహమ్మారి తర్వాత నందమూరి హీరోలు నటించిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకోవడం.. మూడు సినిమాల్లోనూ పాప సెంటిమెంట్ ఉండటం ఆసక్తికరంగా మారింది.
Also Read