'ఫిదా' తరువాత 'గార్గి'తోనే..!
on Jul 4, 2022
'ఫిదా'(2017)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే ఇక్కడివారిని ఫిదా చేసింది. ఆపై 'ఎంసీఏ' (2017), 'లవ్ స్టోరి' (2021), 'శ్యామ్ సింగ రాయ్' (2021) వంటి విజయవంతమైన చిత్రాలతోనూ మురిపించింది.
తాజాగా 'విరాట పర్వం'లో వెన్నెలగా ఆకట్టుకున్న సాయి పల్లవి.. త్వరలో 'గార్గి'గా పలకరించేందుకు సిద్ధమైంది. న్యాయవ్యవస్థ చుట్టూ అల్లుకున్న ఈ ఆసక్తికరమైన చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ రామచంద్ర తెరకెక్కించగా.. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా.. జూలై 15న తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి జనం ముందుకు రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తెలుగునాట సాయి పల్లవి కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచిన 'ఫిదా' కూడా గతంలో జూలై నెలలోనే విడుదలైంది. మరి.. ఐదేళ్ళ తరువాత అదే జూలై నెలలో మరోమారు పలకరించబోతున్న సాయి పల్లవి.. 'గార్గి'తో మరో మెమరబుల్ హిట్ ని అందుకుంటుందేమో చూడాలి. కాగా, 'గార్గి'కి '96' ఫేమ్ గోవింద్ వసంత స్వరాలు సమకూర్చారు.