నరేష్... 'మా' నయా అధ్యక్షుడు
on Mar 11, 2019
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడిగా నటుడు వీకే (సీనియర్) నరేష్ ఎన్నికయ్యారు. శివాజీరాజాపై 69 ఓట్ల ఆధిక్యంతో ఆయన భారీ విజయం సాధించారు. రెండేళ్లు (2019-2021) మా అధ్యక్షుడిగా నరేష్ పదవిలో ఉంటారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమైన పదవులకు నరేష్ ప్యానల్ తరపున పోటీచేసిన సభ్యుల్లో ఎక్కువమంది విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా శివాజీరాజా ప్యానల్ సభ్యులు ఎక్కువమంది విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్ కనకాల, సంయుక్త కార్యదర్శిగా గౌతమ్రాజు, శివబాలాజీ విజయం సాధించారు. వీరిలో హేమ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయగా... శివాజీరాజా ప్యానల్ నుంచి ఎస్వీ కృష్ణారెడ్డి, రాజీవ్ కనకాల పోటీ చేశారు. మిగతా వారందరూ నరేష్ ప్యానల్ సభ్యులే. ఇక, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా విజయం సాధించిన అలీ, పసునూరి శ్రీనివాస్, కరాటే కల్యాణి, జాకీ, అశోక్ కుమార్... నరేష్ ప్యానల్ సభ్యులు. తనికెళ్ల భరణి, వేణుమాధవ్, ఏడిద శ్రీరామ్, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, తనీష్, జయలక్ష్మి, రాజా రవీంద్ర, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వీ, సమీర్, రవిప్రకాశ్... శివాజీరాజా ప్యానల్ సభ్యులు. 'మా' ఎన్నికల చరిత్రలో అత్యధికంగా 472మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. 'మా'లో మొత్తం 745 ఓట్లు ఉన్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన శివాజీ రాజాకు 199 ఓట్లు పాలవగా.. ఆయన కంటే నరేశ్కు 69 ఓట్లు ఎక్కువ వచ్చాయి.